కావేరి వోల్వో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఒక విషయం చర్చించాలనిపించింది నాకు.
అసలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధానంగా కారకులు ఎవరు?
ఈమధ్య నేను దైవదర్శనం కోసము నా బైక్ మీద సిటీ ఔట్స్కర్ట్స్లో ఉన్న ఒక ఆలయానికి వెళ్లాను. ఆ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు టూ వీలర్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ వచ్చి నా బైక్ ని ఆపి, మొదటగా నా వాహన పత్రాలను (కాగితాలను), డ్రైవింగ్ లైసెన్స్ను అడిగాడు. అప్పుడు నేను మొదటగా, నా తలకు ఉన్నటువంటి హెల్మెట్ తీసి, వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ వారికి చూపించాను. తరువాత వారు, "మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా, చూపించండి" అని అడిగాడు. నేను వారికి నా ఇన్సూరెన్స్ కూడా ఆన్లైన్లో చూపించాను. వారు మళ్లీ తిరిగి, "మీ బండికి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా" అని అడిగాడు. కానీ నా బండికి పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు కొద్ది రోజుల ముందే ముగిసింది. నేను దానిని గమనించుకోలేదు. నేను అదే విషయం వారికి చెప్పాను. సో, వారు ఏమన్నారంటే, "మీరు వెంటనే బండికి పొల్యూషన్ పరీక్ష చేయించుకుని, అప్డేట్ చేయించుకోవాలి. ఇప్పుడు మాత్రం మీ బండి మీద మేము ఫైన్ వేస్తున్నామని" చెప్పారు. నేను ఆ సమయంలో నవ్వుతూ, "సార్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను హెల్మెట్ కూడా పెట్టుకున్నాను. కేవలం ఒక పొల్యూషన్ పరీక్ష చేయించుకోవడం ఒక్కటి మాత్రమే మర్చిపోయాను" అని చెప్పాను.
వారు, "సార్, అలాంటిది కుదరదు. మీరు ఫైన్ పే చేయాల్సిందే. మేము ఫైన్ వేస్తున్నామని" చెప్పారు. ఇక ఆ సమయంలో చేసేది ఏమీ లేక, "ఓకే సార్, నా బండికి నేను పొల్యూషన్ అప్డేట్ చేసుకుంటానని" వారికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వారు మాత్రం నా బండికి ఫైన్ వేశారు. ఆ తరువాత నా బండి పొల్యూషన్ పరీక్ష చేయించుకుని అప్డేట్ చేయించుకున్నాను.
ఇక్కడ వారిని తప్పు పట్టలేము. వారి ఉద్యోగాన్ని వారు సక్రమంగానే చేశారు.
ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, సామాన్య ప్రజలకి, వారి వాహనాలకు హెల్మెట్ లేకపోతేనో, ఒక పత్రం లేకపోతేనో వారి వాహనాలను ఆపి వారికి ఫైన్ వేస్తున్న పోలీస్ వ్యవస్థ, రవాణా శాఖ వ్యవస్థ!
తెలుగు రాష్ట్రాల్లో తిరిగే ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్పై, బస్సు పత్రాల తనిఖీలు చేయడంలో ఇదే మాదిరిగా ఎందుకు పని చేయడం లేదు అనేది నా ప్రశ్న?
మనం ఎప్పుడైనా, ఎక్కడైనా బస్సులను ఆపి వారి పత్రాలను కానీ, బస్సు ఫిట్నెస్లను కానీ తనిఖీ చేసిన వార్తలను కానీ మన కళ్ళతో మనం చూశామా? ఒక్కసారి గుర్తు చేసుకోండి.
ఎందుకు ఈ బస్ ట్రావెల్ మాఫియా మీద ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకి ఇంత ప్రేమ? నాకు ఈ మాట అనాలని అనిపించలేదు కానీ, నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత, ఆ బస్సులో సజీవంగా కాలి బూడిదైన వారి ఫోటోలు చూశాక నాకు అడగాలనిపించింది!
ఇలాంటి మాఫియాలను అరికట్టకపోతే ప్రభుత్వాలకి, ప్రభుత్వ అధికారులకి దాని పాపం తగులుతుంది!
కొన్ని రోజుల క్రితం నేను అమెరికాలో యాక్సిడెంట్ జరిగిన సంఘటన వార్తని చదివాను. ఒక భారతీయ పౌరుడు ఒక పెద్ద వాహనాన్ని నడుపుతూ రాంగ్ వేలో టర్న్ చేశాడు. దాని కారణంగా అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ సంఘటన ఆధారంగా అమెరికా ప్రభుత్వము ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. దానిలో తేలిన కొన్ని నిజాల నివేదిక ఆధారంగా అమెరికా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి, ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చింది. దాని వివరాలను మీరు ఆన్లైన్లో వివరంగా వెతుక్కోవచ్చు.
ఇక మన దేశానికి వస్తే, ఇలాంటివి ఎక్కడో ఒకచోట ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు సంతాపాలు తెలిపి, ఆ సంఘటనను మర్చిపోతారు.
నాకు బాగా గుర్తు, 2013 సంవత్సరంలో అనుకుంటా, ఇలాంటి సంఘటననే జబ్బార్ ట్రావెల్స్లో కూడా జరిగింది. అప్పుడు ఆ ప్రమాదంలో 49 మంది బస్సులో సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో నేను విద్యార్థి నాయకుడిగా ఉండేటప్పుడు బాధితుల పక్షాన, ఓయూ జేఏసీ, జేఎన్టీయూ జేఏసీల నుండి మేము బాధితుల పక్షాన పోరాటం చేశాము.
ఆ సమయంలో ఆ సంఘటన చాలా చర్చనీయాంశం అయింది. దాని మీద చాలా చర్చలు జరిగాయి. కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం, తూతూమంత్రంగా మొదలుపెట్టి దాన్ని మధ్యలోనే ఆపేశారు.
ఇక్కడే విషయం ఏమిటంటే, ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు తూతూమంత్రంగా ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేసి, ఆ సంఘటనని మర్చిపోతున్నారు. శాశ్వత పరిష్కారం మాత్రం కనుగొనడం లేదు!
అసలు లోపం ఎక్కడ ఉంది?
చివరగా, ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని మార్పులు చేయాలని ఒక సర్వే చేపడుతున్నారు. ఆ సర్వేలో ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయో లేదో నేను చూడలేదు కానీ, నేను ఇక్కడ రాసిన అంశాన్ని కూడా మీ సర్వేలో భాగంగా చేసుకుని, రాష్ట్ర అభివృద్ధిలో ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడండి!
Regards
Surender Thallapelly



.jpeg)
.jpeg)



