Tuesday, July 30, 2019

నేటి యువతరానికి బూతు పురాణ రాజకీయాలు కాదు.. మీ చరిత్రను మీరే భూస్థాపితం చేసుకున్న వారు అవుతారు .. !


రాజకీయ విలువలు ఎక్కడ ?
ప్రస్తుత సమాజంలో మరియు రాజకీయ వ్యవస్థలో విలువలు, నైతిక విలువలు పూర్తిగా లేకుండా పోయాయి. వాటి గురించి చెప్పేవారు లేరు, ఒకవేళ ఉంటె వాటిని వినేవారు అసలు లేరు .. ఒకవేళ అలాంటి వారు ఎక్కడో ఒక దగ్గర ఉంటె వారిని ఈ ప్రస్తుత సమాజం పిచ్చివాడిని చేసి చూస్తుంది.. కానీ వీటిని పాటించకపోతే ఏదో రోజు ఈ వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాగే  రాజకీయ విలువలు, సిద్ధాంతాలు, వ్యక్తిగత విలువలు, గౌరవ మర్యాదలు అనేవి నేటి, రేపటి భవిష్యత్తు తరాలకు పాఠాలు . ఈ పాఠాలు నేటి తరం పెద్దలు, ఈ తరం యువతరానికి నేర్పించకపోతే వారి సొంత  చరిత్రను, వారి గౌరవ మర్యాదలను, వారి విలువలను, సిద్ధాంతాలను రేపటి  భవిష్యత్తు తరాలకు తెలియకుండా చేసినవారే కాదు, భూస్థాపితం చేస్తుకున్న వారు కూడా వారే అవుతారు. 

గతంలో రాజకీయాలు :
గతంలో రాజకీయాలు, నాయకులు  అంటే  ముందు తరానికి ఆదర్శవంతంగాను ఉండేవారు, అలాగే వారు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాటలో నీతి నిజాయితీ ఉండేవి, వారు చేసే ఆలోచనలు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగాను ఉండేవి. అందుకే ఆనాటి కొంత మంది గొప్ప నాయకులను.. నేటి యువతరం, నేటి తరం నాయకులను కాకుండా ఆ తరం నాయకుల చరిత్రను, ఆలోచనలను పాటిస్తూ అలాంటి నాయకులైన వారందరిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది వారి గొప్పతనం.
నేటితరం ప్రస్తుత రాజకీయాలు  :
నేటి ప్రస్తుత రాజకీయలలో స్వార్థం, మోసం ఈ రెండు కూడా విచ్చలవిడిగా పెరిగి ప్రజా సేవ తగ్గి, వ్యక్తిగత ఎదుగుదల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు. ఈ విధానం ప్రస్తుత పరిస్థితులలో వారికీ అనుకూలించిన, భవిష్యత్తులో మాత్రం వారికీ, వారి చరిత్రకి పెను ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ తరం నాయకులలో కూడా  కొంత మంది మంచి వారు ఉన్నప్పటికీ,  వారి  ఆలోచనలు, వారి విలువలు ప్రజలలోకి, నేటియువతరంలోకి పోకుండా అడ్డుకట్టలు వేస్తూ కుట్రలు చేస్తున్నారు . కానీ అలాంటి నాయకుల విధానాలను, ఆలోచనలను నేటి యువతరం ఎప్పటికప్పుడు  గమనిస్తూనే ఉంది . వారిని, వారి ఆలోచనలను ఆదర్శంగాను తీసుకుంటుంది .  
డబ్బు రాజకీయాలు దేనికి సంకేతం :
నాకు బాగా గుర్తుంది. నా వయసు 10 సంవత్సరాలు, ఆరోజు మా ఊరిలో పంచాయతీ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో పోటీకి నిలబడిన వ్యక్తి  కేవలం ఇంటింటి ప్రచారం, తనతో తనకు ఎన్నికల సంఘం వారు కేటాయించిన గుర్తుతో కూడిన కరపత్రం, చేతిలో తన పార్టీకి సంబంధించిన జెండా,  తక్కువలో తక్కువ  ఒక పది మంది తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇంకా డబ్బు  విషయానికి వస్తే రూపాయలు  5వేల లోపలనే ఖర్చు చేసేవారు, ఇలా ఆనాడు ఎన్నికల ప్రచారం జరిగిది . ప్రస్తుతం నా వయసు 28 సంవత్సరాలు, గత కొన్ని నెలల క్రితం అవే ఎన్నికలు మా ఊరిలో చూశాను, ఈ ఎన్నికలలో 1000 మంది జనాభా ఉన్న మా గ్రామంలో ఖర్చు తక్కువలో తక్కువ 20 లక్షలకు పైగానే  ఖర్చు చేశారు.. ఇది నేటి పరిస్థితి ..ఇది ఒక పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు వివరాలు ఇలా ఉంటె, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఎలా ఉందో, నేను మీకు చెప్పనక్కర్లేదు. ఈ దుస్థితికి  కారకులు ఎవరు, లక్షల కోట్లు రూపాయలు ఖర్చు చేసి ఎన్నికలలో గెలిచిన వ్యక్తి  ప్రజలకు ఆదర్శ పాలన ఇవ్వగలడా ? ఇచ్చిన అవినీతి లేకుండా నీతిమంతమైన పాలన చేయగలడా అనే  విషయాన్ని మన అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది . దీని గురించి నేను వేరే వ్యాసంలో వివరంగాను రాస్తాను ..!
నేటి యువతరానికి మీరు నేర్పించే బూతు పురాణం ఇవేనా ?
ఒక్కప్పటి నాయకుల చరిత్రను గమనిస్తే,  వారు భవిష్యత్తు  తరాలకు విలువలు, విధానాలు, స్ఫూర్తిని కలిగించి విషయాలను నేర్పించే వారు, మాట్లాడే వారు. అలాగే వారు చేసే ప్రతి పనిలో, ఆలోచనలో నిస్వార్థంతో కూడిన ప్రజా సేవ ఉండేది.. వారు కేవలం ప్రజల విధానాల గురించి, దేశ అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచలు చేసే వారు. ఆ తరం  నాయకులలో రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరిపట్ల ఒకరికి  గౌరవ మర్యాదలు పాటించేవారు. అవతలి పక్షం వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లే వారు కారు. కానీ నేటి రాజకీయ విధానాలు, నాయకులను గమనిస్తే  మరోలా ఉంది.. ఈ తరం నాయకులు, అలాకాకుండా పైవారికీ విరుద్ధంగాను పని చేస్తున్నారు.. అదేకాకుండా ప్రజలకు చేయవల్సిన సేవను మర్చిపోయి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్తూ, నేటి భవిష్యత్తు యువతరాలకు బూతు పురాణాలు నేర్పిస్తున్నారు . ఇది సమాజానికి ప్రమాదం, అలాగే వారికీ, వారి చరిత్రకి కూడా ప్రమాదమే..!
చివరాగాను, నాయకులు ఎవరైనా సరే, వారి స్థాయి ఏదైనా సరే..మీరు చేసే విధానాలు, ఆలోచనలు నిస్వార్థంతో వ్యవస్థ  అభివృద్ధి  కోసం చేసే.. అలాంటి వారి చరిత్రను, వారి ఆలోచనలను, మాటలను, పనులను నేటి, రేపటి భవిష్యత్తు తరాల ప్రజలు & యువతరం గుర్తు పెట్టుకుంటారు ..అలాంటి గుర్తింపు మీకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాదు .. ఆలా కాదని స్వార్థంతో, మోసంతో పోతే మీ చరిత్రకు మీరే భూస్థాపితం చేసుకున్న వారు అవుతారు .  
   ఇట్లు
మీ సురేందర్

1 comment:

  1. " నవీనాం: సాగరో గతీ! "
    అంటే సంద్రమే నదీ జలాలకు మూలం , ఉప్పునీటి సంద్రంలో కలవాల్సిందే

    ReplyDelete